Breaking News

టెన్షన్ పెరిగిపోతోందా ?

కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరు రోజు కావటమే. కేసీయార్ పోటీచేస్తున్న గజ్వేలు, కామారెడ్డిలో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్న అనేకమందితో పాటు వ్యక్తిగతంగా కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది నామినేషన్లు వేశారు. వీరితో నామినేషన్లను ఉపసంహరించుకునేట్లుగా నచ్చచెబుతున్నా సాధ్యంకావటంలేదు. నామినేషన్ల స్క్రూటిని తర్వాత గజ్వేలులో 86 మంది, కామారెడ్డిలో 58 మంది పోటీలో ఉన్నారు.

ఇంతమంది పోటీలో ఉంటే అధికారపార్టీకి ఒకరకంగా దెబ్బనే చెప్పాలి. ఎలాగంటే పోటీలో ఉన్నవారికి వాళ్ళ వర్గాలు ఓట్లు వేసుకుంటే కేసీయార్ మెజారిటి బాగా తగ్గిపోతుంది. అసలు రెండింటిలో ఎక్కడో ఒకచోట కేసీయార్ ఓడిపోతారా అనే ప్రచారం కూడా బాగా పెరిగిపోతోంది. ప్రచారం జరుగుతున్నట్లు ఓడకపోవచ్చు కానీ గెలుపు అంత వీజీకాదని మాత్రం అర్ధమైపోతోంది. గజ్వేలులో 2018లో కేసీయార్ కు 58 వేల మెజారిటి వచ్చింది. మరీసారి అంత వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కేసీయార్ మీద పోటీచేస్తున్న వాళ్ళల్లో ఈటల రాజేందర్ కీలకం.

కేసీయార్ ఓటమే టార్గెట్ గా ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఇక్కడ ఈటల సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఆ ఓట్లన్నీ ఈటలకు పడితే కేసీయార్ కు కష్టాలు తప్పవనే చెప్పాలి. దీనికితోడు కేసీయార్ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వర్గాల్లోని వాళ్ళే పోటీలో ఉన్నారు. కాబట్టి ఆ వర్గాల ఓట్లు ఆ అభ్యర్ధులకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదే సమయంలో కామారెడ్డిలో కూడా ఇదే పరిస్ధితి కనబడుతోంది. ఇక్కడ కేసీయార్ కు గట్టి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడా ప్రభుత్వంలో నష్టపోయిన వాళ్ళు, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న రైతులు , ముస్లిం మైనారిటిలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కామారెడ్డిలో కూడా కేసీయార్ గెలుపు అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. ఒకవేళ ఏదైనా ఊహించనిది జరిగి కేసీయార్ ఓడిపోయే పరిస్ధితి ఉంటే మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి రావటం కష్టమనే అనుకోవాలి. మరి ఏమి జరుగుతుందో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.